“నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును”. (యోహాను 10:27)
యేసుకు సంబంధించినవారెవరో ఆయనకు బాగా తెలుసు. ఇది ఎటువంటి జ్ఞానం?
యోహాను 10:3వ వచనం యోహాను 10:27వ వచనానికి చాలా దగ్గరగా సమాంతరంగా ఉంటుంది. “అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును” అని యోహాను 10:3వ వచనంలో ఉంటుంది.
అందుచేత, “నేను వాటిని ఎరుగుదును” అని యేసు చెప్పినప్పుడు, కనీసం ఆయనకు గొర్రెల పేర్లు తెలుసని అర్థం; అంటే, ఆయనకు అవి వ్యక్తిగతంగాను, అన్యోన్యంగాను తెలుసని అర్థం. అవి మందలో నశించిపోయే పేరు తెలియని అనామక గొర్రెలు కావు.
యోహాను 10:14-15 వచనాలు మరొక అంతర్దృష్టిని ఇస్తున్నాయి: “నేను మంచి కాపరిని. నా గురించి తండ్రికి తెలిసినట్లుగా, తండ్రి గురించి నాకు తెలిసినట్లుగా, నా స్వంత గొర్రెలేవో నాకు తెలుసు, నేనెవరో నా స్వంత గొర్రెలకు తెలుసు.”
పరలోక౦లోని తన త౦డ్రి గురించి యేసు తెలుసుకునే విధానానికీ, తన గొర్రెల గురి౦చి తెలుసుకునే విధానానికీ మధ్య నిజమైన సారూప్యత ఉ౦ది. యేసు తనను త౦డ్రిలో చూసుకుంటాడు, ఆయన తనను తన శిష్యులలో చూసుకుంటాడు.
తన శిష్యులలో తన ప్రవర్తనను కొంత స్థాయి వరకు యేసు గుర్తించాడు. ఆయన తనదైన ముద్రను తన గొర్రెలపై ఉండటాన్ని చూస్తాడు. ఇది వారిని ఆయనకు ప్రియమగునట్లుగా చేస్తుంది.
విమానాశ్రయంలో భార్య కోసం ఎదురుచూసే భర్తలా, విమానం నుంచి దిగుతున్న ప్రతి ఒక్కరినీ గమనిస్తూ ఉంటాడు. అతనికి ఆమె తెలుసు కాబట్టి ఆమె కనిపించినప్పుడు అతను ఆమె లక్షణాలను గుర్తిస్తాడు, ఆమె కళ్ళలో తన ప్రేమ యొక్క సంతోషకరమైన ప్రతిబింబాన్ని చూస్తాడు. అతను ఆమెను చూసి ఆనందిస్తాడు. ఆమెని మాత్రమే కౌగిలించుకుంటాడు.
ఈ సందర్భాన్ని అపొస్తలుడైన పౌలు ఇలా చెప్తున్నాడు: అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. – ‘ప్రభువు తనవారిని ఎరుగును’ అనునదియు – ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది” (2 తిమోతి 2:19).
మనం దేవుని కుమారునికి వ్యక్తిగతంగా, అన్యోన్యంగా, ప్రేమపూర్వకంగా తెలియడమనేది ఎంతో భాగ్యమని చెప్పడం అతిశయోక్తి కాదు. అది ఆయన గొర్రెలన్నిటికీ కలిగే అమూల్యమైన బహుమానం, అందులో లోతైన, వ్యక్తిగత సహవాసం, ప్రేమానురాగం, నిత్యజీవానికి సంబంధించిన వాగ్దానములనేవి ఉన్నాయి.



