“ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును, అనగా మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను”. (లూకా 1:68–71)
ఎలీసబెతు భర్త జెకర్యా చెప్పిన ఈ మాటల్లోని రెండు విశేషమైన విషయాలను లూకా 1లో గమనించండి.
మొదటిది, తొమ్మిది నెలల ముందు, జెకర్యా తన భార్యకు సంతానం కలుగుతుందని నమ్మలేకపోయాడు. ఇప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడై, రాబోయే మెస్సీయలో దేవుడు చేయబోయే విమోచన కార్యంపై చాలా నమ్మకం గలవాడై దానిని జరిగిపోయినట్లుగా పేర్కొన్నాడు: “ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను.” విశ్వసించిన వారి మనస్సులో, దేవుని వాగ్దానాలు జరిగిపోయినట్లే. జెకర్యా దేవుని మాటను అంగీకరించడం నేర్చుకున్నాడు మరియు ఒక అద్భుతమైన నిశ్చయత కలిగి ఉన్నాడు: దేవుడు “తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను” (లూకా 1:68).
రెండవది, మెస్సీయ అయిన యేసు యొక్క రాకడ మన ప్రపంచానికి దేవుని దర్శనం: ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను. శతాబ్దాలుగా, యూదా ప్రజలు దేవుడు వారిని ఉపసంహరించుకున్నాడనే నమ్మకంతో కొట్టుమిట్టాడుతున్నారు: ప్రవచనం ఆగిపోయింది; ఇశ్రాయేలు రోమా చేతిలో చిక్కుకుంది. మరియు ఇశ్రాయేలులోని దైవభక్తులందరూ దేవుని దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. మరొక వృద్ధ భక్తుడైన సుమెయోను, “ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు” (లూకా 2:25) అని లూకా చెప్తున్నాడు. అలాగే, ప్రార్థనాపరురాలైన అన్న “యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్నది” (లూకా 2:38).అవి గొప్ప ఆశతో ఎదురుచూస్తున్న రోజులు. ఇప్పుడు చాలా కాలంగా దేవుని కోసం ఎదురుచూస్తున్న వారిని దేవుడు దర్శిస్తున్నాడు – నిజానికి, ఎవరూ ఊహించని సమయంలో ఆయన రాబోతున్నాడు.