“అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు”. (1 కొరింథీయులు 1:23–24)
మనం సృష్టికర్త తీర్పు క్రింద ఉన్నాము మరియు మన పాపంపై శాశ్వతమైన ఉగ్రతను కురిపించడం ద్వారా తన విలువైన కీర్తిని కాపాడుకోవడానికి ఆయన తన స్వంత నీతిగల స్వభావానికి కట్టుబడి ఉన్నాడనే భయానక వార్తకు వ్యతిరేకంగా, సువార్త యొక్క అద్భుతమైన వార్త ఉంది.
ఇది ప్రకృతి నుండి ఎవరూ నేర్చుకోలేని సత్యం. సువార్త యొక్క సత్యాన్ని పొరుగువారికి చెప్పాలి మరియు సంఘములలో బోధించాలి మరియు మిషనరీలు తీసుకువెళ్లాలి.
శుభవార్త ఏమిటంటే, మొత్తం మానవ జాతిని శిక్షించకుండా తన న్యాయమైన హక్కులను తీర్చడానికి దేవుడు స్వయంగా ఒక మార్గాన్ని నిర్ణయించాడు.
పాపుల లెక్కలు తేల్చడానికి మరియు ఆయన న్యాయాన్ని పైకెత్తడానికి నరకం ఒక మార్గం. కానీ మరొక మార్గం కూడా ఉంది. దేవుడు మరో మార్గాన్ని అందించాడు. అదే సువార్త.
న్యాయం విషయములో రాజీ పడకుండా మనలను దేవుని ఉగ్రత నుండి విడిపించి దేవుని ప్రేమను మనపట్ల వ్యక్తపరుచుటకు దేవుని జ్ఞానము ఒక మార్గాన్ని నిర్ణయించింది. అదే సువార్త. నన్ను మళ్ళీ నెమ్మదిగా చెప్పనివ్వండి: న్యాయము విషయములో రాజీపడకుండా మనలను దేవుని ఉగ్రత నుండి విడిపించి దేవుని ప్రేమను మనపట్ల వ్యక్తపరుచుటకు దేవుని జ్ఞానము ఒక మార్గాన్ని నిర్ణయించింది.
ఆ జ్ఞానం ఏమిటి? పాపుల కొరకు దేవుని కుమారుని మరణం! “మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. . . దేవుని శక్తియును దేవుని జ్ఞానము” (1 కొరింథీయులు 1:23-24).క్రీస్తు మరణం అనేది దేవుని జ్ఞానం, దీని ద్వారా దేవుని ప్రేమ పాపులను దేవుని ఉగ్రత నుండి కాపాడుతుంది, అదే సమయంలో క్రీస్తు మరణం దేవుని నీతిని పైకెత్తి ప్రదర్శిస్తుంది.



